👉 పీఎం మిత్ర స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
👉 తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్ టైల్ పార్కులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
👉 టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుతో రూ.వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని మోడీ చెప్పారు.
👉మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ కు ఇదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని మోడీ చెప్పుకొచ్చారు.
👉 13 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందగా.. 1.తెలంగాణ, 2.తమిళనాడు, 3.కర్ణాటక, 4.మహారాష్ట్ర, 5.గుజరాత్, 6.ఉత్తరప్రదేశ్, 7.మధ్య ప్రదేశ్ రాష్ట్రాలను సెలెక్ట్ చేశామని కేంద్ర జౌళి శాఖ తెలిపింది.
👉 వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గీసుకొండ మండలాల పరిధిలోని సుమారుగా 3 వేల ఎకరాల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు.
👉 దీంతో పాటు సిరిసిల్ల మెగా టెక్స్టైల్ పార్కునూ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని పలుమార్లు కోరింది. పీఎం మిత్ర పథకంలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేసింది.
👉 ఎట్టకేలకు ఈ విషయంపై కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. ప్రధాని ప్రకటనతో వరంగల్ లేదా సిరిసిల్లలో ఏదో ఒకచోట మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
👉 వీటి ఏర్పాటు వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.
👉 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి..
👉 దేశంలోని టెక్స్ టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు టెక్స్టైల్ విధానం, ఎకోసిస్టమ్, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని పార్కులను ఏర్పాటు చేసే ప్రాంతాలను ఎంపిక చేశామని జౌళి శాఖ పేర్కొంది.
👉 ఒక్కో పార్కు ఏర్పాటుకు కనీసం 1,000 ఎకరాల భూమిని కేటాయించటంతో పాటు సింగిల్ విండో పర్మిషన్స్, విద్యుత్తు, నీటి వసతి, వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ లాంటివి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందని జౌళి శాఖ వివరించింది.
👉 దీనిపై కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. పీఎం మిత్రా మెగా టెక్స్టైల్ ఏర్పాటు ద్వారా 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.
👉 ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి అని పీయూష్ చెప్పుకొచ్చారు. టెక్స్టైల్ రంగంలో ఇంటర్నేషనల్ లెవల్లో పోటీపడే సామర్థ్యం ఇండియాకు ఉందన్నారు.
👉 అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడడానికి భారీ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి పీఎం మిత్ర పార్కుకు ప్రోత్సాహక మద్దతుగా రూ. 300 కోట్లు అందిస్తామని ఆయన వివరించారు.
👉 ఈ స్కీమ్ అమలుకు కేంద్ర బడ్జెట్లో రూ. 4,455 కోట్లు కేటాయించామన్నారు.